RS Praveen Kumar: సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు... తీవ్రంగా స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar responds on PV Sunil Kumar issue

  • డీజీపీ ర్యాంకులో ఉన్న ఏపీ ఐపీఎస్ అధికారి చేసిన తప్పు మాల కులంలో పుట్టడమేనా? అని ఆగ్రహం
  • సునీల్ కుమార్‌పై విచారణకు అథారిటీని వేయడంపై ఆర్ఎస్పీ ఆగ్రహం
  • సునీల్ గారూ, మౌన రోదన చాలు... పులిలా గర్జించండంటూ సూచన

సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునిల్ కుమార్‌పై విచారణకు అథారిటీని వేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. "ఈ వేధింపులకు అంతం ఎప్పుడు?" అంటూ పోస్ట్ పెట్టారు.

డీజీపీ ర్యాంకులో ఉన్న ఆంధ్ర ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన ఘోరమైన తప్పు ఆయన ఎస్సీ మాల కులంలో పుట్టడమేనా? అయన పేరు చివరన రాజు / నాయుడు / చౌదరి/రెడ్డి /వర్మ/శర్మ లాంటి పేర్లు లేకపోవడమే ఆయన పాలిట శాపమైందని వాపోయారు. ఇది ముమ్మాటికీ నిజమన్నారు. అదే సమయంలో తనకు పైన చెప్పిన అన్ని కులాలలో ఆత్మీయులు ఉన్నారని తెలిపారు.

బ్యాంకులను వందల కోట్ల మేర ముంచి, ఎమ్మెల్యేగా ఎన్నికై దర్జాగా తిరుగుతున్న రఘురామకృష్ణరాజు జైలు బయట ఉండటమేమిటని ప్రశ్నించారు. అదే సమయంలో మూడు దశాబ్దాలుగా దేశానికి సేవలు చేసిన ఒక నికార్సయిన పోలీసు అధికారి పోస్టింగ్ లేకుండా మౌనంగా రోదిస్తూ, అక్రమ కేసుల చిత్ర హింసను గురవడం ఏమిటి? అని నిలదీశారు.

తాను, పీవీ సునీల్ బెల్లంపల్లి(ఆదిలాబాద్)లో 1998 నుండి కలసి పని చేశామని, ఆయనకు ప్రభుత్వాలు ప్రతిసారీ అన్యాయమే చేశాయని వాపోయారు. అందరిలా తనకూ ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వండని వేడుకున్నా అగ్రనాయకుల గుండెలు కరగలేదని ఆరోపించారు. సునీల్ కుమార్‌పై వివక్ష ఏ మీడియాకు కనిపించదని ఆక్రోశించారు. ఎందుకంటే వారికి ఎవరిని బజారున పడేయాలి? ఎవరిని, ఎప్పుడు కాపాడుకోవాలి? అనేది బాగా తెలుసని విమర్శించారు. అణచివేయబడ్డ వర్గాలకు సొంత మీడియా ఉండే అవకాశం ఎన్నడూ రానివ్వరని మండిపడ్డారు.

ఇక 79 శాతం ఆధిపత్య వర్గాలతో నిండిన న్యాయవ్యవస్థలో పీవీ సునీల్ కుమార్ లాంటి అణచివేతకు గురవుతున్న అధికారికి ఉపశమనం దొరుకుతుందన్న ఆశ కూడా తనకు లేదన్నారు. అందుకే, చంద్రబాబు, రోజా ఒకప్పుడు తెలిసి తెలిసి ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అన్నారేమోనని వ్యాఖ్యానించారు. 

సునీల్ కుమార్‌కు ఆర్ఎస్పీ సూచన

"పీవీ సునీల్ గారు, ఇక ఈ మౌన రోదనలు చాలు బ్రదర్. ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టి పీవీ పులి కుమార్‌లా గర్జించండి. ఈ తుఫైల్ మెమోలకు, ఎంక్వైరీలను పట్టించుకోకండి" అని సూచించారు. పోరాటం సాగించాలే తప్ప, వెనక్కి తిరిగి చూడవద్దని, ఎప్పుడూ ముందుకు సాగాలని, ప్రతి అన్యాయాన్ని ఖతం చేయాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News