Manchu Manoj: మంచు కుటుంబంలో మంటలు... చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మంచు మనోజ్

- మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద నిన్న హైడ్రామా
- డీఎస్పీతో మాట్లాడుతున్న మంచు మనోజ్
- కోర్టు ఉత్తర్వులు తనకు అందలేదన్న మనోజ్
మంచు కుటుంబంలో నెలకొన్న విభేదాలు రోజుకొక మలుపు తిరుగుతూ సంచలనం రేకెత్తిస్తున్నాయి. నిన్న తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద హైడ్రామా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తన తాత, నానమ్మల సమాధులకు దండం పెట్టుకునేందుకు యూనివర్శిటీలోకి వెళ్లేందుకు యత్నించిన మనోజ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో లోపలకు అనుమతించలేమని వారు చెప్పారు. చివరకు ఆయనను లోపలకు పంపించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ కూడా చోటుచేసుకుంది.
ఈ క్రమంలో ఈరోజు చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మనోజ్ వెళ్లారు. కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ల జిరాక్స్ కాపీలను పోలీసులు తనకు చూపించడంపై ఫిర్యాదు చేస్తానని మనోజ్ నిన్ననే చెప్పారు. నిన్నటి పరిణామాలపై డీఎస్పీతో మనోజ్ చర్చిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు తనకు అందకపోవడం... కోర్టు ఆర్డర్స్ జిరాక్స్ కాపీలు పోలీసుల వద్ద ఉండటంపై ఆయన మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య మౌనిక, లీగల్ టీమ్ ఉన్నారు.