Indiramma Houses: హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్లు... తొలి ప్రాధాన్యం ఎవరికో చెప్పిన మంత్రి పొన్నం

- ప్రతి నిరుపేదకూ ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి
- స్థలం ఉన్నవారిని తొలుత ఎంపిక చేస్తామని వివరణ
- కొత్త రేషన్ కార్డుల జారీకి క్షేత్ర స్థాయిలో పరిశీలన
హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో స్థలం ఉన్నవారికే తొలి ప్రాధాన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రతీ పేదవాడికీ ఇల్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను వేగంగా పూర్తిచేసి అర్హులకు అందజేస్తామని చెప్పారు. ఈమేరకు ఆదివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, లోకల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఇందులో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై చర్చించినట్లు సమాచారం. సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి 20 వరకు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన జరుగుతుందని చెప్పారు. ఈ నెల 21 నుంచి అర్హులైన వారి వివరాలను డేటా ఎంట్రీ చేసి, 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వివరించారు. జిల్లాల నుంచి హైదరాబాద్ కు వలస వచ్చిన వారికి కూడా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.