Hisaab Barabar: ఆర్.మాధవన్ ప్రధాన పాత్రలో ‘హిసాబ్ బరాబర్’... ట్రైలర్ విడుదల

- జీ5 ఓటీటీ నుంచి మరో ఆసక్తికర చిత్రం... ‘హిసాబ్ బరాబర్’
- అశ్విన్ ధీర్ దర్శకుడు
- జనవరి 24 నుంచి తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రీమియర్కు సిద్ధం
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 నుంచి మరో ఆసక్తికరమైన సినిమా రానుంది. అదే ‘హిసాబ్ బరాబర్’. విలక్షణ నటుడు ఆర్.మాధవన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించగా నీల్ నితిన్, కీర్తి కుల్హారి ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు. జీ5లో జనవరి 24 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రీమియర్కు సిద్ధమైందీ చిత్రం. ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.
ట్రైలర్ను గమనిస్తే.. ఓ బ్యాంక్ చేసే చిన్న పొరపాటు ఓ వ్యక్తి జీవితాన్ని తలక్రిందులు చేస్తే..అతనెలా స్పందించాడు... న్యాయం కోసం అతను ఎలాంటి పోరాటం చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. డ్రామా, కామెడీ, సామాజిక అంశాలతో.. అశ్విన్ ధీర్ దర్శకత్వంలో జియో స్టూడియోస్, ఎస్పి సినీకార్ప్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.
రైల్వే డిపార్ట్మెంట్లో చిరు ఉద్యోగి అయిన రాధే మోహన్ శర్మ పాత్రలో మాధవన్ మనకు ఇందులో కనిపిస్తారు. ఆయన ఓసారి తన బ్యాంక్ ఖాతాలో చిన్న తేడాని గుర్తించి బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తాడు. దాని గురించి ఆరా తీయగా అదొక పెద్ద ఆర్థికమైన మోసమని తెలుస్తుంది. దాని చుట్టు ఉన్న మోసం, అవినీతి వంటి వాటిని సదరు టికెట్ కలెక్టర్ గుర్తిస్తాడు. ఈ క్రమంలో తను ఆ బ్యాంక్ హెడ్ మిక్కీ మెహతా (నీల్ నితిన్) వంటి పెద్ద వ్యక్తితో పోరాటం చేయాల్సి వస్తుంది.
ఊహించని మలుపులతో సాగే ఈ కథలో రాధే మోహన్ అనే సామాన్యుడు అవినీతితో వ్యవస్థీకృతమైన సమస్య నుంచి ఎలా ఎదుర్కొంటాడు.. దాన్నుంచి సురక్షితంగా ఎలా బయట పడతాడు? అనే విషయాలను తెరపై చూడాల్సిందే.
హీరో ఆర్.మాధవన్ మాట్లాడుతూ "జీ5తో నేను చేసిన తొలి సినిమా ఇది. ఇలాంటి ఓ సినిమాలో భాగం కావటం అనేది యాక్టర్గా నాకెంతో సంతోషంగా ఉంది. సామాన్యుడైన రాధే మోహన్ శర్మ పాత్రలో నటించటాన్ని ఎంజాయ్ చేశాను. ఈ పాత్ర నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. మనలో ఉండే కామన్ మ్యాన్ అవినీతికి వ్యతిరేకంగా ఎలా పోరాటం చేశాడనేదే కథ. మూవీ అందరికీ నచ్చుతుంది. ఇలాంటి వాస్తవ కథనాలతో సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను" అన్నారు.
దర్శకుడు అశ్విన్ ధీర్ మాట్లాడుతూ "సమాజంలోని అవినీతి, మోసాలను ఓ సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో రూపొందిన‘హిసాబ్ బరాబర్’ అందరినీ ఆలోచింపజేసే చిత్రం. సామాజిక అంశాలతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన డ్రామా, కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మాధవన్, నీల్ నితిన్, కీర్తి కుల్హారి వంటి వారు తమదైన నటనతో మెప్పిస్తారు. జనవరి 24న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది" అన్నారు.