శ్రీవారి వైకుంఠ దర్శనం కౌంటర్ల మూసివేత.. మళ్లీ ఎప్పుడంటే..!
- మూడు రోజులకు 1.20 లక్షల టికెట్ల జారీ
- 13 వతేదీ నుంచి రోజుకు 40 వేల టికెట్లు
- ఏ రోజుకు ఆరోజే ఇవ్వనున్నట్లు టీటీడీ వెల్లడి
ఈ నెల 10, 11, 12 తేదీల్లో వైకుంఠ దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మూడు రోజులకు స్వామి వారి దర్శన టోకెన్లను 1.20 లక్షల భక్తులకు జారీ చేశామని పేర్కొంది. ఈ నెల 18వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపింది. 12వ తేదీ వరకు దర్శన టోకెన్లను ఇప్పటికే జారీ చేశామని, 13వ తేదీ నుంచి ఏరోజుకు ఆరోజు టోకెన్లు జారీ చేస్తామని వివరించింది. కాగా, వైకుంఠ దర్శన టోకెన్ల కోసం బుధవారం రాత్రి తిరుపతిలో తొక్కిసలాట జరగగా ఆరుగురు భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషాదం తర్వాత భద్రతా సిబ్బందితో పరిస్థితిని చక్కదిద్దిన టీటీడీ.. గురువారం ఉదయం టోకెన్లను జారీ చేసింది.