పేర్ని జయసుధపై కక్ష సాధించాల్సిన అవసరం మాకు లేదు: పవన్ కల్యాణ్
- గోడౌన్ లో ఉండాల్సిన బియ్యం మాయం
- పేర్ని నాని భార్య జయసుధ పేరిట గోడౌన్
- గోడౌన్ ఆమె పేరు మీద ఉంది కాబట్టి ఆమెపైనే కేసు పెట్టారన్న పవన్
- ఇందులో కక్ష సాధింపు ఎక్కడుందని ప్రశ్న
ఇవాళ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్ మీడియా రిపోర్టర్లతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేర్ని జయసుధను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు చేసినట్టుగా, ఇంట్లోని ఆడవారిని లక్ష్యంగా చేసుకుని తాము బూతులు తిట్టడంలేదని తెలిపారు.
"సాక్షాత్తు సీఎం చంద్రబాబు అర్ధాంగి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిందే వాళ్లు. పౌరసరఫరాల శాఖ పరిధిలో ఓ గోడౌన్ లో భారీగా బియ్యం నిల్వలు మాయమయ్యాయి. అక్రమాలు జరిగిన గోడౌన్ పేర్ని జయసుధ గారి పేరు మీద ఉంది. అందువల్ల చట్టపరంగా కేసులో జయసుధ గారి పేరు పెట్టాల్సి ఉంటుంది. తప్పు జరిగిందని తెలిసే గోడౌన్ యజమానులుగా వారు, తప్పును ఒప్పుకొని అప్పటికప్పుడు రూ.1.7 కోట్ల జరిమానా కట్టడానికి ముందుకు వచ్చారు. మరి తప్పు జరిగినప్పుడు దోషులుగా వారి పేరు పెట్టడంలో తప్పేముంది. దీనిలో కక్ష సాధింపు ఎక్కడుంది...?" అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.