ayyappa devotees: విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు కేంద్రం గుడ్‌ న్యూస్

good news to ayyappa devotees

  • ఇరుముడి విషయంలో కేంద్ర విమానయాన శాఖ భద్రత నిబంధనలు సడలింపు
  • అయ్యప్ప భక్తులు విమానంలో తమతో పాటే ఇరుముడి తీసుకువెళ్లవచ్చన్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
  • కేంద్ర మంత్రికి ఎక్స్ వేదికగా అభినందనలు తెలుపుతున్న అయ్యప్ప భక్తులు

విమానాల ద్వారా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే దీక్షా స్వాములకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రానికి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం పౌర విమానయాన శాఖ ద్వారా నిబంధనలు సడలించడం జరిగిందని ఆయన తెలిపారు.

సెక్యూరిటీ స్కానింగ్ అనంతరం భక్తులు పవిత్రమైన ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్‌లోనే ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు. మండలం నుంచి మకర జ్యోతి దర్శనం (జనవరి 20) వరకూ కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటు భద్రతా సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకూ భద్రతా కారణాల రీత్యా ఇరుముడిని వెంట తీసుకెళ్లనిచ్చేవారు కాదు. ఇరుముడిని చెకిన్ బ్యాగేజీలో తరలించే వారు. 

భక్తుల ఇబ్బందులు తెలుసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ..అయ్యప్ప దీక్షా స్వాముల ఇరుముడికి సంబంధించి నిబంధనలను సడలించారు. ఈ విషయాన్ని మంత్రి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. అయ్యప్ప భక్తులు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుకు అభినందనలు తెలియజేస్తున్నారు.

  • Loading...

More Telugu News