Ram Charan: రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో క్వీన్ ఎలిజబెత్ II తర్వాత గ్లోబల్ స్టార్!

Ram Charan To Get Wax Statue Alongside Pet Rhyme At Madame Tussauds Second After Queen Elizabeth II

  • 2025 వేసవిలో రామ్ చరణ్ మైనపు బొమ్మ ఆవిష్కర‌ణ‌
  • ఆయ‌న పెంపుడు కుక్క‌ రైమ్ కూడా ఈ మైనపు బొమ్మలో కలిసి ఉండటం విశేషం
  • క్వీన్ ఎలిజబెత్ II కాకుండా, వారితో పాటు ఒక పెంపుడు జంతువుతో కూడిన మైనపు బొమ్మ కలిగిన ఏకైక సెలబ్రిటీగా చెర్రీ

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో త‌న‌ మైనపు బొమ్మతో తన గ్లోబల్ స్టార్‌డమ్‌ను చిరస్థాయిగా మార్చుకోబోతున్నారు. 2025 వేసవిలో రామ్ చరణ్ మైనపు బొమ్మ ఆవిష్కరించనున్నారు. అబుదాబిలో జరిగిన స్టార్-స్టడెడ్ 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డ్స్‌లో ఈ ప్రకటన వెలువ‌డింది. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన విశేషమైన సేవలకు, ప్రపంచవ్యాప్త ఆకర్షణకు గుర్తింపుగా చరణ్ "మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డును అందించారు.

సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రతిష్ఠాత్మకమైన సూపర్‌స్టార్ల లైనప్‌లో చేరడం నిజంగా గౌరవంగా భావిస్తున్నట్లు రామ్ చరణ్ తెలిపారు. చిన్నప్పుడు, దిగ్గజ నటులను చూసి నేను ఆశ్చర్యపోయే వాడిని. ఏదో ఒక రోజు వారి మధ్య నేను కూడా ఉంటానని కలలో కూడా అనుకోలేదు. ఇది అద్భుతమైన అవకాశం. మేడమ్ టుస్సాడ్స్ ఇస్తున్న ఈ గుర్తింపును ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌న్నారు.

ఇక చెర్రీ కటౌట్‌కి ఒక ప్రత్యేకమైన టచ్ జోడిస్తూ, ఆయ‌న పెంపుడు కుక్క‌ రైమ్ కూడా ఈ మైనపు బొమ్మలో కలిసి ఉండ‌నుండటం విశేషం. దీంతో క్వీన్ ఎలిజబెత్ II కాకుండా, వారితో పాటు ఒక పెంపుడు జంతువుతో కూడిన మైనపు బొమ్మ కలిగిన ఏకైక సెలబ్రిటీగా చెర్రీ నిలవబోతున్నారు. 

ఈ విష‌యమై చ‌ర‌ణ్‌ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్‌లో రైమ్ నాతో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. రైమ్ నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. నా వ్యక్తిగత జీవితంతో ఎంతో ముడిపడి ఉన్న అంశం అని పేర్కొన్నారు. 

కాగా, 2017లో ప్రారంభమైన ఐఐఎఫ్ఏ, మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ మధ్య భాగస్వామ్యం ప్రపంచ వేదికపై భారతీయ సినిమా వేడుకలను ఒకచోట చేర్చింది. "ఐఐఎఫ్ఏతో మా భాగస్వామ్యాన్ని కొనసాగించడం ఆనందంగా ఉంది. మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో ప్రతిష్ఠాత్మకమైన భారతీయ సినిమా దిగ్గజాల శ్రేణికి రామ్ చరణ్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం" అని మెర్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోని గేట్‌వే ఆసియా రీజినల్ డైరెక్టర్ అలెక్స్ వార్డ్ అన్నారు. 

ఇక మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో ఇప్పటికే ఉన్న ఐఐఎఫ్ఏ జోన్ మరింత బలోపేతం కానుంది. ఇందులో ఇప్పటికే షారూఖ్ ఖాన్, కాజోల్, కరణ్ జోహార్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ భారతీయ సినీ తారల బొమ్మలు ఉన్నాయి.


  • Loading...

More Telugu News