KTR: కాళ్లు మొక్కి కండువాలు కప్పింది ఎవరు?: శ్రీధర్ బాబుపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

KTR fires at minister Sridhar Babu

  • బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కాళ్లు మొక్కారని విమర్శ
  • శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని జోస్యం
  • అరికెపూడికి పార్టీ ఏం అన్యాయం చేసిందని నిలదీత

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కి కండువాలు కప్పింది ఎవరు? అలా చేసిన సన్నాసి వెధవ ఎవరు? అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ... త్వరలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందని జోస్యం చెప్పారు.

చెరువులన్నీ నిండితే కప్పలన్నీ వస్తాయన్న సామెత ఉందని, మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని, అందుకే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అధికార పార్టీలోకి జంప్ చేశారని విమర్శించారు. కానీ ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన 150 మందితో సమావేశం పెడదామనుకుంటే వెయ్యి మందికి పైగా వచ్చారన్నారు. ఇది శేరిలింగంపల్లి పోరాటస్ఫూర్తిని తెలియజేస్తోందన్నారు.

శేరిలింగంపల్లికి ఉపఎన్నిక వస్తే ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. అరికెపూడి గాంధీకి పార్టీ ఏం అన్యాయం చేసిందని ఫిరాయించాడో చెప్పాలన్నారు. అరికెపూడి గాంధీ ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినట్లుగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ అతి తెలివి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ వ్యక్తి కాదు... బీఆర్ఎస్‌కు చెందిన వ్యక్తే అని శ్రీధర్ బాబు అంటున్నారని, అదే నిజమైతే అరికెపూడికి కండువా కప్పిన సన్నాసి వెధవ ఎవరు? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, కె.కేశవరావు వంటి నేతల ఇళ్లకు వెళ్లి కాళ్లు మొక్కి మరీ వారికి కండువాలు కప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News