ప్రకాశ్ రాజ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు.. వైవీ సుబ్బారెడ్డి విచారణకు హాజరు కావాల్సిందే: పవన్ కల్యాణ్
- తిరుమల లడ్డూ అపవిత్రం అయిందంటే చాలా ఆవేదన కలుగుతోందన్న పవన్
- భూమన తిరుమలలో హైడ్రామా చేశారని విమర్శ
- పొన్నవోలు మదమెక్కి మాట్లాడారని మండిపాటు
తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో గతంలో టీటీడీ ఛైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి విచారణ ఎదుర్కోవాల్సిందేనని పవన్ చెప్పారు. గతంలో టీటీడీ ఈవోగా పని చేసిన ధర్మారెడ్డి ఎక్కుడున్నారో కూడా తెలియడం లేదని విమర్శించారు. లడ్డూ అంశంపై వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. పొన్నవోలు మదమెక్కి మాట్లాడారని... ప్రస్తుత పరిస్థితుల్లో పొగరుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే ఒప్పుకోవాలని... లేకపోతే సంబంధం లేదని చెప్పాలని అన్నారు. ధర్మాన్ని కాపాడే బాధ్యత మీమీద లేదా? అని ప్రశ్నించారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన గురించి మాట్లాడారని... ఏం జరిగిందో తెలుసుకుని ఆయన మాట్లాడాలని పవన్ అన్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే మాట్లాడొద్దా? అని ప్రశ్నించారు. సెక్యులరిజం అంటే టూ వే అని... వన్ వే కాదని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని ప్రకాశ్ రాజ్ ను హెచ్చరించారు.