Pushpa-2: పుష్ప-2కు, జానీ మాస్టర్ వివాదానికి సంబంధం లేదు!
- పుష్ప-2 రెండు పాటలకు ఆమె అడిషనల్ కొరియోగ్రాఫర్
- జానీ మాస్టర్ కూడా ఒక పాట చేయాలి
- ఈ వివాదం పూర్తిగా జానీ మాస్టర్ వ్యక్తిగత సమస్య
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం కుదిపేస్తుంది. తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల ఆరోపిస్తూ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే జానీ మాస్టర్ అసిస్టెంట్కు అల్లు అర్జున్ అండగా వుండి.. ఆమెకు సినిమాల్లో కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడని, దీంతో పాటు భవిష్యత్లో గీతా ఆర్ట్స్లో సినిమాలు చేసే అవకాశం కూడా ఇస్తున్నాడని గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో వార్త ప్రచారంలో వుంది.
ఈ విషయంపై సోమవారం పుష్ప-2 నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ 'మత్తు వదలరా-2' ప్రెస్మీట్లో పాల్గొని విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానలిచ్చారు. '' జానీమాస్టర్ ఇష్యూలో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. మీరు ఆ సినిమా నిర్మాతల్లో ఒకరు కాబట్టి దీనిపై మీరు సమాధానం ఇవ్వగలరా? అని ప్రశ్నించగా, 'మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది కూడా ఇలాంటి న్యూస్లు టెలికాస్ట్ చేయడం లేదు. కేవలం సన్సేషన్ కోసం ప్రయత్నించే కొన్ని కొత్త యూట్యూబ్ ఛానెల్స్ ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా జానీ మాస్టర్ పర్సనల్ విషయం. పుష్ప-2 సినిమా ప్రారంభంలోనే జానీ మాస్టర్ అసిస్టెంట్ను అదనపు కొరియోగ్రాఫర్గా తీసుకున్నాం.
ఆమె సినిమాలోని అన్ని పాటలకు అడిషనల్ కొరియోగ్రాఫర్గా వుంటారు. మెయిన్ కొరియోగ్రాఫర్స్ వేరే వాళ్లు వుంటారు. ఇప్పటి వరకు మా చిత్రం నుండి విడుదల చేసిన రెండు పాటల్లో కూడా ఆమె పేరు వుంటుంది. ఇక సినిమాలో వున్న ఓ స్పెషల్ సాంగ్కు జానీ మాస్టర్ వర్క్ చేయాలి. ఇంతలోనే ఈ సంఘటన జరిగింది. ఇదే వాస్తవం. కొన్ని సెక్షన్ మీడియా మాత్రమే సన్సేషన్ కోసం ఇలాంటి న్యూస్లను క్రియేట్ చేస్తుంది. అంతే తప్ప పుష్ప-2కు జానీ మాస్టర్ వివాదానికి ఎటువంటి సంబంధం లేదు' అని రవిశంకర్ చెప్పారు.