Girija: నా బాల్యం కన్నీళ్ల మయం: నటి గిరిజ కూతురు సలీమా

Saleema Interview

  • 1950లలో ఇండస్ట్రీకి వచ్చిన గిరిజ 
  • 300లకి పైగా సినిమాలు చేసిన హాస్యనటి 
  • ఆర్ధికంగా ఆమె ఇబ్బందులు పండిందన్న కూతురు 
  • గిరిజ తమ ఇంట్లోనే చనిపోయారని వెల్లడి 
  • ఇండస్ట్రీ సాయం చేయలేదని వ్యాఖ్య


బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో తెలుగు తెరపై తన జోరు చూపించిన హాస్యనటి .. గిరిజ. 1950లలో 'పరమానందయ్య శిష్యుల కథ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, మూడున్నర దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగారు. 300లకి పైగా సినిమాలలో నటించారు. అలాంటి గిరిజ చివరిరోజులు విషాదకరంగా ముగిశాయని చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గిరిజ కూతురు సలీమా, అనేక అంశాలు ప్రస్తావించారు.

"మా అమ్మగారిది గుడివాడ. ఒక ట్రంక్ పెట్టెలో బట్టలు పెట్టుకుని 'చెన్నపట్టణం' వచ్చినట్టుగా చెబుతూ ఉండేది. అప్పటికే ఆమె నాటకాలు వేస్తూ ఉండేది .. బీఏ కూడా పూర్తి చేసింది. 'పాతాళభైరవి' సినిమా నుంచి ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఇక ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. అప్పట్లో రేలంగి - అమ్మ లేని సినిమా ఉండేది కాదు. కార్లు .. బంగ్లాలు .. నౌకర్లు .. ఇలా విలాసవంతమైన జీవితం చూశాను. కానీ ఆ తరువాత అవన్నీ మాయమవుతూ వచ్చాయి" అన్నారు. 

" మా అమ్మకి చాలా గొప్ప సంబంధాలు వచ్చాయట. కానీ ఆమె ఒక డిస్ట్రిబ్యూటర్ ను పెళ్లి చేసుకుంది. అతను ప్రతిరోజూ తాగుతూ .. అమ్మను కొడుతూ ఉండేవాడు. చిన్నపిల్లనని చూడకుండా నన్నూ కొట్టేవాడు. ఆయన చేసిన సినిమా బిజినెస్ వలన నష్టాలు వచ్చాయి. ఆయన ఇల్లొదిలి వెళ్లిపోయాడు. ఆ అప్పులు తీర్చడం కోసం మా ఆస్తులన్నీ అమ్మేయవలసి వచ్చింది. అలా ఆర్ధికంగా అమ్మ ఎన్నో కష్టాలు పడింది. నాన్న పెట్టే హింస .. అమ్మ కష్టాలు చూస్తూనే పెరిగాను" అని చెప్పారు.

" నా అసలు పేరు కాళేశ్వరి .. అమ్మ మతం మారినప్పుడు సలీమా అనే పేరు పెట్టారు. అమ్మపేరు కూడా 'కరీమా బేగం'గా మార్చుకుంది .. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. నా 20 ఏళ్ల వయసులో అమ్మ చనిపోయింది. ఆ సమయంలో శోభన్ బాబు గారు .. అల్లు రామలింగయ్య గారు తప్ప, ఇండస్ట్రీ నుంచి ధైర్యం చెప్పినవారు లేరు. అమ్మ దిక్కులేని స్థితిలో బస్టాండులో చనిపోయారనే ప్రచారం నాకు బాధను కలిగించింది.. అందులో నిజం లేదు. మా అమ్మ మా ఇంట్లోనే చనిపోయింది" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News