Nagarjuna Sagar: నాగార్జున సాగర్ 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలిన అధికారులు

6 gates of Nagarjuna Sagar Project opened

  • కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేసిన అధికారులు
  • దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైరన్ మోగించిన అధికారులు
  • ఆ తర్వాత ఒక్కో గేటు ఎత్తిన అధికారులు

నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అధికారులు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు. ఎగున నుంచి భారీగా వరద నీరు నాగార్జున సాగర్‌లోకి చేరుతోంది. దీంతో కొన్ని గేట్లను ఎత్తారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు మూడుసార్లు సైరన్ మోగించారు. ఆ తర్వాత ఒక్కో గేటును ఎత్తారు.

సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీశైలం నుంచి వచ్చే వరదను అంచనా వేసి మరిన్ని గేట్లను ఎత్తే అవకాశముంది. నల్గొండ, సూర్యాపేట, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కో గేట్ నుంచి 7,300 క్యూసెక్కుల చొప్పున మొత్తం 43,800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, సాగర్ ప్రస్తుత నీటి మట్టం 582.60 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 290.51 టీఎంసీలు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఇన్-ఫ్లో 3,23,748 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 83,331 క్యూసెక్కులు.

  • Loading...

More Telugu News