Chandrababu: నేను, శాంతిస్వరూప్ కలిసి 'ప్రజలతో ముఖ్యమంత్రి' అనే కార్యక్రమాన్ని ప్రతి సోమవారం చేసేవాళ్లం: చంద్రబాబు
![TDP Chief Chandrababu Naidu Tweet on Veteran Doordarshan news reader Shanthi Swaroop](https://imgd.ap7am.com/thumbnail/cr-20240405tn660fae38bc9af.jpg)
- తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందన్న టీడీపీ అధినేత
- తెలుగు దూరదర్శన్లో వార్తలు అనగానే మొదటగా గుర్తొచ్చేది శాంతిస్వరూపేనన్న చంద్రబాబు
- 'ప్రజలతో ముఖ్యమంత్రి' అనే కార్యక్రమంతో ఆరేళ్ల తమ సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న వైనం
తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు. హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సోషల్ మీడియా వేదికగా శాంతిస్వరూప్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
'ఎక్స్' (ట్విటర్) వేదికగా చంద్రబాబు స్పందిస్తూ.. "తొలి తెలుగు న్యూస్ రీడర్, యాంకర్, రచయిత శాంతిస్వరూప్ మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగు దూరదర్శన్లో వార్తలు అనగానే మొదటగా గుర్తొచ్చేది శాంతిస్వరూప్. నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేమిద్దరం కలిసి 'ప్రజలతో ముఖ్యమంత్రి' అనే కార్యక్రమాన్ని ప్రతి సోమవారం చేసేవాళ్లం. ఆరు సంవత్సరాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు నేరుగా తమ సమస్యలను చెప్పుకుని పరిష్కారం పొందేవారు. ఈ విధంగా మా అనుబంధం సుదీర్ఘమైనది. శాంతి స్వరూప్ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని టీడీపీ అధినేత ట్వీట్ చేశారు.