లవ్ స్టోరీతో కుర్రకారు మనసులు దోచేసిన రుక్మిణి వసంత్!
- 'బీర్బల్'తో పరిచయమైన రుక్మిణి వసంత్
- 'సప్తసాగరాలు దాటి'తో పెరిగిన క్రేజ్
- సహజమైన నటనతో మెప్పించిన వైనం
ఈ సినిమాలో రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించగా, కథానాయికగా రుక్మిణి వసంత్ కనిపిస్తుంది. నటిగా ఆమెకి చాలా అనుభవం ఉందనుకుంటే పొరపాటే, 'బీర్బల్' సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయమైన ఆమెకి, 'సప్తసాగరాలు దాటి సైడ్ ఎ' రెండో సినిమానే. ఆ సినిమాతోనే ఆమె కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా .. అందమైన భావాలున్న ప్రియురాలిగా ఆమె మంచి మార్కులు కొట్టేసింది.
అలా 'సప్తసాగరాలు దాటి సైడ్ బీ' సినిమా చూస్తుంటే, ఎక్కడా కూడా ఆమె నటిస్తున్నట్టుగా అనిపించదు. ఆమె లైఫ్ స్టైల్ ను హీరో .. ఓ పాత రైల్ బోగిలో నుంచి గమనిస్తూ ఉంటాడు. అలా ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్ర ద్వారా ఆమెను చూస్తాడు. అప్పుడు ఆమె మన కళ్లముందు తిరిగే ఒక సాధారణమైన యువతిలా .. చాలా సహజంగా కనిపిస్తుంది. అలా నటించడం అంత ఆషామాషీ విషయమేం కాదు. అందువల్లనే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా రుక్మిణి వసంత్ కి అవకాశాలు వెళుతున్నట్టుగా తెలుస్తోంది.