జూపల్లి ఇంట్లో ఇంకా వైఎస్ఆర్ ఫొటో ఉంది.. కేసీఆర్ ఫొటో ఎందుకు లేదని అడిగా: మంత్రి సింగిరెడ్డి
- పొంగులేటి, జూపల్లి పార్టీ క్రమశిక్షణ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణ
- ఈ ఇద్దరూ ఎవరి ట్రాప్ లో ఉన్నారో అందరికీ తెలుసని వ్యాఖ్య
- తెలంగాణ ఉద్యమంలో వీరి పాత్రనే లేదన్న మంత్రి నిరంజన్ రెడ్డి
‘బలిదానాల గురించి జూపల్లి మాట్లాడడానికి నైతికత ఉండాలి. గతంలో ఆయన ఉన్న పార్టీనే తెలంగాణ యువత బలిదానాలకు కారణమైంది. పార్టీని వీడి వచ్చినందుకు 2014లో గెలిచిన జూపల్లికి అంతకుముందు నుంచి ఉన్నవారిని కాదని కేసీఆర్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. కానీ, 2018లో ఉమ్మడి పాలమూరులోని 14 నియోజకవర్గాల్లో ఓడిపోయింది కొల్లాపూర్ ఒక్కటే. జూపల్లి ఎందుకు ఓడిపోయాడో ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. పొంగులేటి పార్టీలో ఏం చేశారో .. ఎందుకు అవకాశం రాలేదో ఖమ్మం ప్రజలకు తెలుసు. జూపల్లి ఇంట్లో ఇంకా వైఎస్ఆర్ ఫోటో ఉంటుంది. కేసీఆర్ ఫోటో ఎందుకు లేదని అడిగాను. మంత్రిగా తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా వైఎస్ విగ్రహం పెట్టారు. ప్రజలకు న్యాయం జరగకుంటే గత ప్రభుత్వంలో ఏం చేశారు? గత నాలుగేళ్లుగా ఏం చేస్తున్నారు?’ అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.