కాంగ్రెస్ భిక్షతో ఎదిగిన వాళ్లే పార్టీకి వెన్నుపోటు పొడిచారు: రేవంత్ రెడ్డి
- నవంబరు 3న మునుగోడు ఉప ఎన్నిక
- కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై దాడి
- దాడిలో బీజేపీ అభ్యర్థి పాల్గొన్నాడన్న రేవంత్
- ఆడబిడ్డ అని కూడా చూడలేదని ఆగ్రహం
కాంగ్రెస్ భిక్షతో ఎదిగినవాళ్లే పార్టీకి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. కాంగ్రెస్ ను అంతం చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర పన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడమే వాటి లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ ఏం పాపం చేసిందని ఈ కుట్రలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి నిలదీశారు.
సీఆర్పీఎఫ్, ఎలక్షన్ కమిషన్ ను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర పోలీసులు, అధికార యంత్రాగాన్ని టీఆర్ఎస్ విచ్చలవిడిగా వాడుకుంటోందని పేర్కొన్నారు.
"మునుగోడులో కలిసి కదం తొక్కుదాం... లాఠీ అయినా, తూటా అయినా మీ ముందు నేనుంటా... మునుగోడులో మీకోసం వేచి చూస్తుంటా" అని తన లేఖలో పిలుపునిచ్చారు. తెలంగాణ నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు మునుగోడు బాటపట్టాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ప్రాణం పోసిన సోనియా గాంధీకి ద్రోహం జరుగుతుంటే చూస్తూ ఊరుకుందామా? అని ప్రశ్నించారు.