IPL 2022: రాజస్థాన్ బౌలర్లకు హైదరాబాద్ దాసోహం.. తొలి మ్యాచ్‌లో దారుణ పరాభవం

Rajasthan Royals kickstart ipl campaign

  • బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెలరేగిన రాజస్థాన్
  • భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో హైదరాబాద్ విఫలం
  • 61 పరుగుల తేడాతో పరాజయం

రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు నిలవలేకపోయారు. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన హైదరాబాద్.. రాయల్స్ బౌలర్ల పదునైన బంతులకు వికెట్లు టపటపా రాల్చుకుంది. ఫలితంగా ఐపీఎల్‌లో తలపడిన తొలి మ్యాచ్‌లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో దారుణ ఓటమి పాలైంది.

రాజస్థాన్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా వెళ్తున్నట్టు కనిపించలేదు. మార్కరమ్  (41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు), రొమారియో (18 బంతుల్లో 2 సిక్సర్లతో 24 పరుగులు) వాషింగ్టన్ సుందర్ (14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు) రాణించారు. మిగతావారెవరూ సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. 

రాహుల్ త్రిపాఠి నికోలస్ పూరన్ డకౌట్ కాగా, కెప్టెన్ విలియమ్సన్ 2, అభిషేక్ శర్మ 9 పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేసి విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది. యుజ్వేంద్ర చాహల్ 3, ట్రెంట్ బౌల్ట్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సంజు శాంసన్ (55) వీరవిహారానికి తోడు మిగతా బ్యాటర్లు కూడా చెలరేగడంతో భారీ స్కోరు సాధించగలిగింది. జోస్ బట్లర్ 35, జైస్వాల్ 20, పడిక్కల్ 41, హెట్మెయిర్ 32 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో టి.నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్, రొమారియో తలా ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో అన్ని జట్లు తలా ఓ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాయి. నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి.

IPL 2022
Rajasthan Royals
Sunrisers Hyderabad
Sanju Samson
  • Loading...

More Telugu News