DC: 'నా కుటుంబం కొవిడ్ తో పోరాడుతోంది... ఈ సీజన్ ఐపీఎల్ ఇక ఆడను': రవిచంద్రన్ అశ్విన్!

Ashwin Not Playing Next IPL Games

  • ఢిల్లీ కాపిటల్స్ తరఫున ఆడుతున్న అశ్విన్
  • అశ్విన్ ఇంట్లోని పలువురికి కరోనా
  • వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది
  • అశ్విన్ కు మద్దతుగా నిలుస్తామన్న డీసీ

ఢిల్లీ కాపిటల్స్ లో అత్యంత కీలకమైన స్పిన్నర్ గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు. నిన్నటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో సూపర్ ఓవర్ వరకూ జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలుపు తరువాత రవిచంద్రన్ అశ్విన్ ట్విట్టర్ లో స్పందించారు.

"రేపటి నుంచి ఈ సంవత్సరం ఐపీఎల్ పోటీల నుంచి విరమించుకుంటున్నాను. నా కుటుంబీకులు, బంధువులు, కొవిడ్ 19పై పోరాడుతున్నారు. ఈ కష్ట సమయంలో వారికి నేను అండగా నిలవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులన్నీ చక్కబడితే తిరిగి పోటీల్లోకి వస్తాను. ధన్యవాదాలు ఢిల్లీ కాపిటల్స్" అని ట్వీట్ చేశారు. అశ్విన్ ట్వీట్ కు ఢిల్లీ కాపిటల్స్ కూడా స్పందించింది. "మీ కుటుంబం కష్టాల్లో ఉన్న వేళ మా మద్దతు పూర్తిగా ఉంటుంది. ఢిల్లీ కాపిటల్స్ తరఫున మీ కుటుంబానికి మద్దతు ఉంటుంది. మీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం" అని పేర్కొంది.

ఇక నిన్నటి మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన అశ్విన్, 27 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ ను కూడా తీయలేదు. సూపర్ ఓవర్ ను కూడా అక్సర్ పటేల్ తో బౌలింగ్ చేయించారు. సూపర్ ఓవర్ లోనూ ఆఖరి బంతి వరకూ సాగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ స్టార్ ఆటగాళ్లు రిషబ్ పంత్, శిఖర్ ధావన్ లు తమ ముందున్న 7 పరుగుల లక్ష్యాన్ని అధిగమించారు.

DC
Ravichandran Ashwin
COVID19
Corona Virus
IPL
  • Loading...

More Telugu News