Padmaja: కరోనాను సృష్టించింది చైనా కాదు, నేనే!.... మదనపల్లె నిందితురాలి వింత ప్రవర్తన వీడియో ఇదిగో!

  • సంచలనం సృష్టించిన మదనపల్లె ఘటన
  • కుమార్తెలను కొట్టి చంపిన తల్లిదండ్రులు
  • పోలీసుల అదుపులో పద్మజ, పురుషోత్తంనాయుడు
  • కరోనా టెస్టుల నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
Madanapalle incident accused Padmaja mystic behavior at hospital

మదనపల్లె ఘటన గురించి వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంటే, జంట హత్యలకు పాల్పడిన తల్లి పద్మజ మాటలు, ఆమె మానసిక పరిస్థితి మరింత విస్మయం కలిగిస్తున్నాయి. నిందితురాలు పద్మజను అదుపులోకి తీసుకున్న పోలీసులు కరోనా పరీక్షల నిమిత్తం మదనపల్లె ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆమె వింతప్రవర్తనతో అందరూ ఆందోళనకు గురయ్యారు.

పద్మజ కరోనా టెస్టు చేయించుకునేందుకు నిరాకరించింది. శివుడు మదనపల్లెలోనే ఉన్నాడని, అందుకే కరోనా పారిపోయిందని వ్యాఖ్యలు చేసింది. నేనే శివుడ్ని... నాకు కరోనా రావడమేంటి? అని పేర్కొన్న పద్మజ.... కరోనాను సృష్టించింది చైనా కాదు తానే అంటూ మరింత గందరగోళానికి గురిచేసింది.

అంతకుముందు పద్మజ, పురుషోత్తంనాయుడు దంపతులను సుదీర్ఘ సమయం పాటు విచారించిన పోలీసులకు మతిపోయినంత పనైంది. దయ్యం పట్టినందునే తమ కుమార్తెలను డంబెల్స్ తో కొట్టిచంపామని, మళ్లీ వాళ్లిద్దరూ బతికి వస్తారని చెప్పారు. తమ ఇంట్లో కొన్నిరోజులుగా ఎన్నో మహిమలు జరిగాయని, తమ ఇంట్లో దేవుళ్లు ఉన్నారని తెలిపారు. తాము పూజలతోనే చిన్నకుమార్తె సాయిదివ్య అనారోగ్యాన్ని తగ్గించామని, వారం పాటు అర్ధరాత్రి 12 గంటలకు ఇంటి బయట పూజలు చేశామని చెప్పారు. 10 రోజులుగా ఉపవాసాలు ఉన్నామని పేర్కొన్నారు.

ఇక కలియుగం అంతమైందని, సత్యయుగం మొదలైందని పోలీసులకు వివరించారు. తమ ఇద్దరు కుమార్తెలను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నామని, వారిద్దరూ చదువుల్లో మేటి అని తల్లి పద్మజ తెలిపింది. తాము పూర్తి స్పృహలోనే ఉన్నామని, తమ పిల్లలు ప్రాణాలతో మళ్లీ తిరిగి వస్తారని ధీమా వ్యక్తం చేసింది.

More Telugu News