Vemula Prashanth Reddy: బీజేపీ నేతలు తమ స్థాయికి మించి మాట్లాడుతున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

  • సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమన్న మంత్రి
  • కేసీఆర్ ను జైల్లో పెట్టే ధైర్యం ఉందా అంటూ వ్యాఖ్యలు
  • బీజేపీని రైతులు తరిమికొడతారని స్పష్టీకరణ
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా తీసుకురావాలని సవాల్
Telangana minister Prashant Reddy gets anger over BJP comments

తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు తమ స్థాయికి మించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ను జైల్లో పెట్టే ధైర్యం ఎవరికుందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ను ఎందుకు జైల్లో ఉంచాలి... తెలంగాణను అభివృద్ధి చేస్తున్నందుకా? అని నిలదీశారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తమ సహనాన్ని పరీక్షించొద్దని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

బీజేపీని రైతులు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. 5 రోజుల్లో పసుపు బోర్డు మంజూరు చేయిస్తామని చెప్పి రైతులను మోసం చేసిన బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీకి కావాల్సింది ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమేనని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతలకు చేతనయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని సవాల్ విసిరారు.

More Telugu News