EVKS Elangovan: ఆ పెద్దాయన ఎలా ఓడిపోయాడో రజనీకాంత్ కు కూడా అదే గతి పడుతుంది: ఇళంగోవన్

  • తమిళనాడు పరిస్థితులపై ఇళంగోవన్ వ్యాఖ్యలు
  • రజనీ పార్టీకి భవిష్యత్ లేదని వెల్లడి
  • గతంలో శివాజీ గణేశన్ వైఫల్యం చెందాడని వివరణ
  • కేంద్రం రైతులకు ద్రోహం చేసిందని ఆరోపణలు
  • తమిళనాడు ప్రజలు బీజేపీని అంగీకరించబోరని స్పష్టీకరణ
EVKS Elangovan comments on Rajinikanth political future

మరికొన్ని రోజుల్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రజా బాహుళ్యంలోకి రానున్న నేపథ్యంలో తమిళనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ కూడా రాజకీయాల్లో ప్రయత్నించి ఘోర వైఫల్యం చెందాడని, ఇప్పుడు రజనీకాంత్ కు కూడా అదే గతి పడుతుందని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోడ్ లో నిరసనల్లో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇళంగోవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీపైనా విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి బదులు మోదీ గడ్డం రోజురోజుకు పెరుగుతోందని వ్యాఖ్యానించారు. మూడు వ్యవసాయ చట్టాలు తీసుకురావడం ద్వారా కేంద్రం రైతులకు ద్రోహం తలపెట్టిందని మండిపడ్డారు. 2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదని ఇళంగోవన్ తెలిపారు. తమిళనాడు ప్రజలు బీజేపీని అంగీకరించబోరని స్పష్టం చేశారు. ఏఐడీఎంకేతో బీజేపీ పొత్తు పారదని అభిప్రాయపడ్డారు.

More Telugu News