యూట్యూబ్ లో దూసుకుపోతున్న 'ఉప్పెన' పాట!
- వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా 'ఉప్పెన'
- 'నీ కన్ను నీలి సముద్రం' పాటకు విశేష ఆదరణ
- యూట్యూబ్ లో 150 మిలియన్లకు పైగా వ్యూస్
- దేవిశ్రీ ప్రసాద్ బాణీకి యువత ఫిదా
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఇందులోని 'నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం' పాట అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. యూట్యూబ్ లో అయితే, ఇప్పటివరకు 150 మిలియన్లకు మించిన వ్యూస్ ను సొంతం చేసుకుంది.
ప్రముఖ గీత రచయిత శ్రీమణి రాసిన ఈ పాటను జావేద్ అలీ పాడడం జరిగింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కట్టిన బాణీ యువతను ప్రేమమైకంలో ముంచెత్తుతోంది. అందుకే ఇప్పుడీ పాట విడుదలకు ముందే ఇన్ని వ్యూస్ ను దక్కించుకుంది. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటించింది.