IPL 2020: 33 సిక్సర్లు నమోదైన మ్యాచ్ లో... ధోనీ సేనపై రాజస్థాన్ విజయం!

Rajasthan Royals Win on Chennai Super Kings

  • ఆకాశమే హద్దుగా చెలరేగిన సంజూ శాంసన్
  • రెండో మ్యాచ్ లో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్
  • 17 బంతుల్లో 29 పరుగులు చేసిన ధోనీ

తొలుత సంజూ శాంసన్, మధ్యలో స్మిత్, చివర్లో ఆర్చర్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో, ఈ ఐపీఎల్ లో టైటిల్ వేటకు తాను కూడా రేసులో ఉన్నానని రాజస్థాన్ రాయల్స్ నిరూపించింది. తనదైన రోజున ఎటువంటి జట్టునైనా ఓడించే సత్తా తనకుందని చాటుతూ, ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది.

తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఓడించిన ఉత్సాహంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఈ మ్యాచ్ లో ఓడిపోయి తొలి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఈ మ్యాచ్ లో మొత్తం 33 సిక్సర్లు నమోదు కావడం విశేషం. అంతేకాదు... 2010 తరువాత ఐపీఎల్ లో చెన్నై జట్టుపై తొలుత బ్యాటింగ్ కు దిగి, రాజస్థాన్ రాయల్స్ గెలవడం కూడా ఇదే తొలిసారి.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 32 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్స్ లతో 74 పరుగులు చేశాడు. కెప్టెన్ స్మిత్ 47 బంతుల్లో 4 ఫోర్లు, నాలుగు సిక్సుల సాయంతో 69, జోఫ్రా ఆర్చర్ 8 బంతుల్లో నాలుగు సిక్సర్లతో 27 బాదడంతో భారీ స్కోరు నమోదైంది. శామ్సన్, స్మిత్ రెండో వికెట్ కు 57 బంతుల్లోనే 121 పరుగులు జోడించడం గమనార్హం.

ఆపై 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, భారీ లక్ష్య ఛేదనలో తడబడింది. తొలుత వాట్సన్ కాస్తంత దూకుడుగా ఆడినప్పటికీ, విజయ్, కరణ్, జాదవ్ తదితరులు రాణించక పోవడంతో టాప్ ఆర్డర్ కుప్పకూలింది. తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రుతురాజ్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఆపై డుప్లెసిస్ దూకుడుగా ఆడినా ప్రయోజనం లేకపోయింది. చివరి 38 బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన స్థితిలో, 16 పరుగులు తక్కువయ్యాయి. ధోనీ 17 బంతుల్లో 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం ఒక్కటే, ఈ మ్యాచ్ లో చెన్నై అభిమానులకు కాస్తంత ఆనందం కలిగించే అంశం.

IPL 2020
Sanju Samson
MS Dhoni
RR
CSK
  • Loading...

More Telugu News