local circles survey: పండగ ప్రయాణాలపై కరోనా ఎఫెక్ట్.. ఇంటి నుంచి కదలడానికి ఇష్టపడని జనం!

No journeys in festive season in India

  • ‘లోకల్ సర్కిల్స్’ సర్వేలో వెల్లడి
  • దసరా, దీపావళి పండుగలు ఉన్న చోటనే జరుపుకునేందుకు మొగ్గు
  • 19 శాతం మంది మాత్రమే ప్రయాణాలకు సిద్దం

కరోనా నేపథ్యంలో ఈసారి పండుగలకు ప్రయాణాలు అంతంత మాత్రమేనని ఓ సర్వే పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి అత్యధిక శాతం మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అతి స్వల్పంగా మాత్రం ప్రయాణాలకు సై అంటున్నారు. ‘లోకల్ సర్కిల్స్’ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ దేశంలోని 239 జిల్లాల్లో 25 వేల మందిపై జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

రాబోయేది పండుగల సీజన్ కావడంతో ప్రయాణాల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించింది. కరోనా కారణంగా ఈసారి ప్రయాణాలకు ప్రజలు అంతగా మొగ్గుచూపడం లేదని సర్వేలో తేటతెల్లమైంది. 69 శాతం మంది ప్రజలు పండుగలకు తాము ఎక్కడికీ వెళ్లడం లేదని, ఇంట్లోనే ఉంటామని చెప్పగా, 19 శాతం మంది మాత్రమే ప్రయాణాలకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

ప్రయాణాలు చేయాలనుకున్న వారిలో 23 శాతం మంది విమాన ప్రయాణానికి సిద్ధపడగా, 38 శాతం మంది కారు, లేదంటే క్యాబ్‌లో వెళ్తామని చెప్పారు. 13 శాతం మంది కుటుంబ సభ్యులను, స్నేహితులను కలవడానికి ఇష్టపడగా, 3 శాతం మంది విహార యాత్రలకు వెళ్తామని చెప్పారు. మరో మూడు శాతం మంది మాత్రం రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చారు. 12 శాతం మంది మాత్రం ప్రయాణాలు పెట్టుకుంటామా? లేదా? అన్నది ఇంకా నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు.

local circles survey
Dasara
Diwali
festivals
India
  • Loading...

More Telugu News