East Godavari District: అందమైన యువతిని ఎరగా వేసి యువకుడి హత్య... ఆరు నెలల తరువాత 'కాకినాడ హత్య కేసు'ను ఛేదించిన పోలీసులు!

Honey Trap Murder Case in East Godavari Dist

  • జిల్లాలకు పాకిన హనీట్రాప్
  • గత సంవత్సరం హత్య
  • ఆరు నెలల తరువాత ఛేదించిన పోలీసులు

హనీ ట్రాప్ ఉదంతాలు ఇప్పుడు జిల్లాలకు కూడా పాకుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచి కలకలం రేపుతోంది. భూమి తగాదాల నేపథ్యంలో, ఓ యువకుడికి ఓ అందమైన అమ్మాయిని ఎరగా చూపిన ప్రత్యర్థులు, అతన్ని వంచించి దారుణంగా హత్య చేశారు. గత సంవత్సరం డిసెంబర్ 8న ఈ హత్య జరుగగా, దాదాపు ఆరు నెలల తరువాత ఇది వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే... కాకినాడ సమీపంలో గత సంవత్సరం రామకృష్ణ అనే యువకుడి మృతదేహం కనిపించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. రామకృష్ణ కాట్రేనికోన మండలానికి చెందిన యువకుడు కాగా, అతనికి అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో భూమి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణను అడ్డు తొలగించుకోవాలని భావించిన శ్రీనివాస్ మాస్టర్ ప్లాన్ వేశాడు.

అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో డీల్ కుదుర్చుకుని, ఆమెతో రామకృష్ణకు వల వేయించాడు. అదే యువతితో ఫోన్ చేయించి రామకృష్ణను కాకినాడకు పిలిపించి, పక్కా ప్లాన్ తో హత్య చేయించి అరట్లకట్ట సమీపంలోని పంట కాల్వలో పడేశారు. తమ బిడ్డ కనిపించడం లేదంటూ రామకృష్ణ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మృతదేహం కనిపించింది.

అయితే, కేసులో పురోగతి లేకపోవడంతో, రామకృష్ణ కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి ఆదేశాలతో కదిలిన పోలీసులు, రామకృష్ణ కాల్ డేటాను పరిశీలించి, సదరు యువతిని, ఆపై శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేశామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

East Godavari District
Honey Trap
Murder
  • Loading...

More Telugu News