తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మా అదుపులో ఉన్నాడు: రాచకొండ సీపీ మహేశ్ భగవత్
- కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడని వెల్లడి
- ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారన్న సీపీ
- ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగేలా చూస్తామని స్పష్టీకరణ
ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘బాచారంలోని సర్వే నెం. 92, 93 లో ఉన్న ఏడు ఎకరాల భూమి పాసు పుస్తకాల వ్యవహారంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 1.15గంటలకు హత్య జరిగినట్లు సమాచారం వుంది. నిందితుడు సురేష్ మా అదుపులోనే ఉన్నాడు. 60 శాతం కాలిన గాయాలతో ఉన్న నిందితుడిని ఆస్పత్రిలో చేర్పించాము. చికిత్స కొనసాగుతోంది. ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి ఘటన జరగటం ఇదే తొలిసారి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరిగేలా చూసి నిందితుడికి కఠిన శిక్షపడేలా చేస్తాం’ అని అన్నారు.