Andhra Pradesh: ఫలించని బొత్స రాయబారం.. వైసీపీని వీడేందుకే వంగవీటి రాధాకృష్ణ మొగ్గు!

  • నేడు గంటపాటు చర్చలు జరిపిన సత్తిబాబు
  • విజయవాడ సెంట్రల్ సీటుపై పీటముడి
  • విజయవాడ ఈస్ట్ కు పోటీ చేయాలంటున్న జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. వైసీపీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేయనున్నారు. వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ సీటును కోరుతుండగా, ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం  విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని సూచించారు. దీంతో మనస్తాపం చెందిన రాధ గతంలో పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంకాగా, విజయసాయిరెడ్డి సహా పలువురు వైసీపీ సీనియర్ నేతలు ఆయన్ను సముదాయించారు. తాజాగా ఈరోజు వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ వంగవీటి రాధాకృష్ణతో దాదాపు గంటకు పైగా చర్చించారు. పార్టీలోనే కొనసాగాలని సూచించారు.

అయితే విజయవాడ సెంట్రల్ ఇస్తేనే పార్టీలో ఉంటానని వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. దీంతో బొత్స నిరాశగా వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధ త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశముందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. వైసీపీ అధినేత జగన్ నిర్ణయం నేపథ్యంలో ఇటీవల రంగా, రాధా మిత్రమండలి సమావేశం నిర్వహించిన రాధ.. అనుచరులు, మద్దతుదారులతో సుదీర్ఘంగా చర్చించారు. వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడి టీడీపీలో చేరతారా? లేక జనసేన తీర్థం పుచ్చుకుంటారా? అన్న విషయం ఇంకా తెలియరాలేదు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News