పొంగులేటి ఊర్లోకి అడుగుపెడితే దూకి చస్తా.. సెల్ టవర్ ఎక్కిన యువకుడు!
- ఖమ్మం జిల్లా ముదిగొండలో ఘటన
- అభివృద్ధి పనులు చేయలేదని యువకుడి ఆవేదన
- స్టేషన్ కు తరలించిన పోలీసులు
గోకినపల్లి గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కమలరాజు నిన్న ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కమలరాజుతో పాటు ఎంపీ పొంగులేటి వస్తున్నారని తెలుసుకున్న నాగరాజు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. పొంగులేటి ఊర్లో అడుగుపెడితే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అసలు తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు.
మరోవైపు నాగరాజు టవర్ ఎక్కడంతో బంధువులు, గ్రామస్తులతో పాటు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బ్రతిమాలారు. అయితే కొద్దిసేపటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గోకినపల్లికి రావడం లేదని తెలుసుకున్న నాగరాజు తాపీగా కిందకు దిగివచ్చాడు. దీంతో పోలీసులు నాగరాజును స్టేషన్ కు తరలించారు.