త్రివిక్రమ్ అలా చేసి వుంటే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
- హీరో తండ్రి .. సోదరుడు హత్య చేయబడతారు
- పగ తీర్చుకోవడానికి హీరో రంగంలోకి దిగుతాడు
- కానీ ఆ తరువాత జరిగే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ
'అజ్ఞాతవాసి' సినిమా పూర్తి వినోదభరితమైన చిత్రం .. త్రివిక్రమ్ - పవన్ సూపర్ హిట్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. 'అత్తారింటికి దారేది' వంటి అద్భుతమైన విజయాన్ని వాళ్లు ఇచ్చి వున్నారు. అందువలన ఎంతో ఆశతో వచ్చిన ప్రేక్షకులకు ఆ ఆశ నెరవేరలేదని అనుకున్నారు. ఈ సినిమాను చూడగానే నేను ఒకటి అనుకున్నాను. 'రక్త తిలకం' సినిమా కోసం మేం చేసిన మార్పును త్రివిక్రమ్ కూడా చేసి వుంటే బాగుండునే అనిపించింది.
త్రివిక్రమ్ ఎలా అయితే తన సినిమాకు ఆర్డర్ రాసుకున్నాడో .. మేం కూడా 'రక్త తిలకం' సినిమాకి అలాగే రాసుకున్నాము. అప్పుడు రామానాయుడు గారు .. 'అదేంటయ్యా .. తల్లి మంచంలో పడి వుంటే హీరో ఎలా డ్యూయెట్లు పాడుకుంటాడు .. నాకు నచ్చలేదు .. మార్చేయండి' అన్నారు. అలాంటి ఆలోచన 'అజ్ఞాతవాసి'కి ఎవరూ చెప్పలేదు. ఈ సినిమాలో తండ్రి పాత్ర .. సోదరుడి పాత్ర హత్యకి గురవుతాయి. అప్పుడు పగ తీర్చుకోవడానికి బయల్దేరిన హీరో .. ఆ హంతకులను లేపేస్తాడనే అంతా భావిస్తారు. కానీ అలా జరగకుండా హీరో బాగా ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఆడియన్స్ కి నిరాశ కలగడంలో ప్రధానమైన కారణంగా నాకు ఇది కనిపించింది" అని చెప్పుకొచ్చారు.