siddarth malhotra: క్షమాపణలు చెప్పినా చల్లారని ప్రజలు...బాలీవుడ్ నటుడి దిష్టిబొమ్మల దహనం!

  • ‘అయ్యారీ’ సినిమాలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో జతకట్టిన రకుల్ ప్రీత్ సింగ్
  • బిగ్ బాస్ షోలో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న రకుల్, సిద్ధార్థ్, మనోజ్ బాజ్ పాయ్
  • మనోజ్ బాజ్ పాయ్ కోరిక మేరకు భోజ్ పురి భాషలో డైలాగ్ చెప్పిన సిద్ధార్థ్

బాలీవుడ్ లో పాగా వెయ్యాలని భావిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ‘అయ్యారీ’ సినిమాలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో జతకట్టింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సిద్ధార్థ్, సీనియర్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ లతో కలిసి కండల వీరుడు సల్మాన్‌ హోస్ట్‌ చేస్తున్న బిగ్‌ బాస్‌ షోకు రకుల్ వెళ్లింది. ఈ సందర్భంగా మనోజ్‌ బాజ్‌ పాయ్ కోరికమేరకు భోజ్‌ పురి భాషలో సల్మాన్ సినిమా డైలాగ్‌ ను సిద్ధార్థ్ చెప్పాడు.

అయితే ఫన్నీగా సాగిన ఆ ఎపిసోడ్‌ కాస్తా అభ్యంతరకర వ్యాఖ్యలతో నిండిపోయింది. దీంతో భోజ్‌ పురి కమ్యూనిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సిధార్థ్‌ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేసింది. గోదావరి, 13 బి సినిమాల ఫేమ్ నీతూ చంద్ర కూడా ఈ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసింది.

భోజ్ పురి స్టార్ నటుడు, బీజేపీ నేత మనోజ్ తివారీ మాట్లాడుతూ, ‘‘సిద్ధార్థ్‌ చేసిన వ్యాఖ్యలు నేనూ విన్నా. 22 కోట్ల మంది మనోభావాలను అతను దారుణంగా దెబ్బతీశాడు. నేను వాటిని ఖండిస్తున్నా. మనం ప్రతీ భాషను గౌరవించాల్సిన అవసరం ఉంది. కళాకారులకు ఆ బాధ్యత ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అతను మంచి నటుడే. కానీ, ఇలా వ్యవహరించటం కుసంస్కారం. క్షమాపణలు చెప్పినా ప్రజలు అతన్ని వదిలేస్తారని నేను అనుకోవట్లేదు’’ అని పేర్కొన్నాడు.

దీంతో నిరసనలు మరింత రాజుకున్నాయి. పాట్నా, వారణాసి, కోల్‌ కతా, ముంబై, తదితర ప్రాంతాల్లో భోజ్ పురి వాసులు సిద్ధార్థ్‌ పై పోలీసులకు ఫిర్యాదులు చేశాయి. దీంతో సిద్ధార్థ్ మల్హోత్రా క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ నిరసనకారులు శాంతించడం లేదు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News