పాకిస్థాన్‌కు మ‌రో ఘోర ఓట‌మి

పాకిస్థాన్‌కు మ‌రో ఘోర ఓట‌మి
  • పాకిస్థాన్, న్యూజిలాండ్‌ మ‌ధ్య రెండో టీ20
  • పాక్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్ 
  • ఈ విజ‌యంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0తో లీడ్‌లోకి కివీస్ 
న్యూజిలాండ్‌ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు మ‌రో ఓట‌మి ఎదురైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ జ‌రిగిన రెండో టీ20లో పాక్‌ను ఆతిథ్య కివీస్ 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పాక్ నిర్దేశించిన 136 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మ‌రో 11 బంతులు మిగిలి ఉండ‌గానే ఆతిథ్య జ‌ట్టు చేధించింది. కాగా, తొలి టీ20లోనూ స‌ల్మాన్ అఘా సారథ్యంలోని పాక్ జ‌ట్టు ప‌రాజ‌యం పాలైన విష‌యం తెలిసిందే. 

ఇక ఇవాళ్టి మ్యాచ్‌ను వ‌ర్షం కార‌ణంగా 15 ఓవ‌ర్ల‌కు కుదించారు. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 15 ఓవ‌ర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 ప‌రుగులు చేసింది. కెప్టెన్ స‌ల్మాన్ అఘా 46 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. స‌దాబ్ ఖాన్ 26, షాహీన్ షా అఫ్రిది 22 ర‌న్స్ చేయ‌గా.. మిగ‌తా బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో జాక‌బ్ డ‌ఫ్పీ, బెన్ సీయ‌ర్స్‌, జేమ్స్ నీష‌మ్‌, ఇష్ సోధీ త‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

అనంత‌రం 136 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన కివీస్ 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. 13.1 ఓవ‌ర్ల‌లోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెన‌ర్లు టిమ్ సీఫ‌ర్ట్‌, ఫిన్ అలెన్‌ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పాక్ బౌల‌ర్లపై విరుచుకుప‌డ్డారు. తొలి వికెట్‌కు ఈ ద్వ‌యం 66 పరుగుల భాగ‌స్వామ్యాన్ని అందించింది. 

సీఫ‌ర్ట్ (45), ఫిన్ (38), మిచెల్ హే (21) రాణించ‌డంతో న్యూజిలాండ్ 5 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. పాక్ బౌల‌ర్ల‌లో హ‌రీస్ రౌఫ్ 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా... మ‌హ్మ‌ద్ అలీ, కుష్దీల్ షా, జ‌హాందాద్ ఖాన్ చెరో వికెట్ తీశారు. ఈ విజ‌యంతో కివీస్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 తేడాతో లీడ్‌లోకి దూసుకెళ్లింది.  


More Telugu News