జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

  • స్పీకర్ స్థానంపై తమకు ఎంతో గౌరవం ఉందన్న హరీశ్ రావు
  • స్పీకర్ ను జగదీశ్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడలేదని వ్యాఖ్య
  • స్పీకర్ పట్ల గౌరవంగా ఉండాలని కేసీఆర్ తమకు చెపుతుంటారన్న హరీశ్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సెషన్ మొత్తానికి ఆయనను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు సభ ప్రారంభమైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ... జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు. మిమ్మల్ని అవమానించేలా జగదీశ్ రెడ్డి మాట్లాడలేదని అన్నారు.

స్పీకర్ ఎన్నిక సందర్భంగా మీకు బీఆర్ఎస్ పూర్తి మద్దతును ప్రకటించిందని హరీశ్ చెప్పారు. స్పీకర్ పట్ల గౌరవంగా వ్యవహరించాలని తమకు తమ పార్టీ అధినేత కేసీఆర్ చెపుతుంటారని తెలిపారు. తమ సభ్యులందరికీ మీపై ఎంతో గౌరవం ఉందని చెప్పారు. జగదీశ్ రెడ్డి మీ గురించి ఏకవచనంతో మాట్లాడలేదని చెప్పారు. సభలో ఉంటే జగదీశ్ రెడ్డి మాట్లాడేవారని... కానీ సస్పెన్షన్ కారణంగా ఆయన సభకు రాలేకపోయారని అన్నారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించాలని కోరారు. సభలో జగదీశ్ రెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించాలని విన్నవించారు.


More Telugu News