స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నాం... రైల్వే జోన్ తెచ్చుకున్నాం: మంత్రి లోకేశ్‌

స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నాం... రైల్వే జోన్ తెచ్చుకున్నాం: మంత్రి లోకేశ్‌
  • శాసనమండలిలో వైసీపీ సభ్యుల వ్యాఖ్యలకు మంత్రి లోకేశ్‌ సమాధానం
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నామ‌న్న మంత్రి
  • అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధించామ‌ని వెల్ల‌డి
రాష్ట్ర ప్రయోజనాల కోసం బేషరతుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కేంద్రానికి మద్దతు ఇస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. 

మేం పదవులు అడగలేదు, రాష్ట్రాన్ని కాపాడాలని మాత్రమే కోరామ‌ని మంత్రి తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు రూ.13 వేల కోట్లు తెచ్చామ‌ని, స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నామ‌ని గుర్తు చేశారు. అలాగే రైల్వే జోన్ తీసుకురావ‌డంతో పాటు పోలవరం, అమరావతికి నిధులు తెచ్చామ‌న్నారు.

కేంద్ర ప్రభుత్వ సహకారం ఏపీకి చాలా అవసరమని, అందుకే తాము బేషరతుగా ఎన్డీఏలో చేరామ‌న్నారు. ఐదేళ్లలో మీరు తీసుకురాలేని నిధులు తాము 9 నెలల్లో తెచ్చామ‌ని చెప్పారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 6.5 లక్షల కోట్లపెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు జ‌రిగాయ‌న్నారు. ఇప్పుడు పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు వచ్చేసరికి రెండు, మూడు సంవత్సరాలు పడుతుందన్నారు. 

ఉద్యోగావకాశాలు కల్పించామని మాత్రమే తాము చెప్పామ‌ని, ఉద్యోగాలు ఇచ్చామని తాము ఎక్క‌డా చెప్పలేదని వివరణ ఇచ్చారు. దళితుల గొంతు నొక్కుతున్నారని వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలకు మంత్రి లోకేశ్‌ తీవ్రంగా స్పందిస్తూ... దళితులపై దాడులు చేసింది ఎవరో, చంపి డోర్ డెలివరీలు చేసిన వారు ఎవరో ప్రజలందరికీ తెలుస‌ని అన్నారు.


More Telugu News