'బిగ్ బీ'నా మ‌జాకా.. ఒక్క‌ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌పై అమితాబ్‌కు 168 శాతం లాభం!

'బిగ్ బీ'నా మ‌జాకా.. ఒక్క‌ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌పై అమితాబ్‌కు 168 శాతం లాభం!
  • ఓషివారాలోని తన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను రూ.83 కోట్లకు విక్ర‌యించిన బిగ్ బీ
  • ఈ అపార్ట్‌మెంట్‌ను 2021లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేసిన అమితాబ్‌ 
  • దీంతో అమితాబ్ బచ్చన్‌కు 168 శాతం మేర లాభం
అమితాబ్ బచ్చన్ ముంబ‌యిలోని ఓషివారాలోని తన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను తాజాగా రూ.83 కోట్లకు విక్రయించారు. ఈ అపార్ట్‌మెంట్‌ను అమితాబ్‌ 2021 ఏప్రిల్ లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. త‌ద్వారా ఆయ‌న‌కు 168 శాతం మేర లాభం వ‌చ్చింది.  

కాగా, 4, 5, 6 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌లను అందిస్తూ 1.55 ఎకరాలలో విస్తరించి ఉన్న ఓషివారాలోని క్రిస్టల్ గ్రూప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయిన 'ది అట్లాంటిస్‌'లో ఈ ప్రాపర్టీ ఉంది. ఇక ఐజీఆర్ రిజిస్ట్రేషన్ పత్రాల సమీక్ష ఆధారంగా ఈ లావాదేవీ ఈ ఏడాది ప్రారంభంలో నమోదు అయింది.

అంతకుముందు ఈ అపార్ట్‌మెంట్‌ను బిగ్ బీ.. నటి కృతి సనన్‌కు అద్దెకు ఇచ్చారు. నెలవారీ అద్దె రూ. 10 లక్షలు కాగా, రూ. 60 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌తో అపార్ట్‌మెంట్‌ను 2021 నవంబర్ లో అద్దెకు ఇవ్వ‌డం జ‌రిగింది. ఇక ఈ అపార్ట్‌మెంట్‌ విస్తీర్ణం దాదాపు 5,704 చదరపు అడుగుల వరకు ఉంటుంది.

ఇదిలాఉంటే.. గ‌తేడాది బచ్చన్ కుటుంబం రియల్ ఎస్టేట్‌లో సుమారు రూ. 100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ప్రధానంగా ఓషివారా, మగథానే (బోరివాలి ఈస్ట్)లోని నివాస, వాణిజ్య ప్రాప‌ర్టీలపై దృష్టి సారించింది. ఇలా 2020 నుంచి 2024 వరకు అమితాబ్ ఫ్యామిలీ దాదాపు రూ. 200 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిన‌ట్లు తెలుస్తోంది.


More Telugu News