ఏపీకి తప్పిన ముప్పు.. బలహీనపడిన వాయుగుండం

ఏపీకి తప్పిన ముప్పు.. బలహీనపడిన వాయుగుండం
  • తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
  • ఇంకా అలజడిగానే సముద్రం.. చేపల వేటకు వెళ్లొద్దని జాలర్లకు హెచ్చరిక
  • మంగళవారం నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో రేపటి వరకు తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం ఇంకా అలజడిగానే ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసింది.

వాయుగుండం ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నిన్న కూడా భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు, మంగళవారం నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. 


More Telugu News