ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా నామా నాగేశ్వర రావు, మాలోతు కవిత

ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా నామా నాగేశ్వర రావు, మాలోతు కవిత
  • ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ 
  • ఖమ్మం నుంచి నామాకు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవితకు అవకాశం
  • 2019లో లక్షన్నర మెజార్టీతో విజయం సాధించిన నామా నాగేశ్వర రావు, కవిత  
  • కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌కు టిక్కెట్
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నలుగురి పేర్లను ఖరారు చేశారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వర రావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవితలకు మరోసారి అవకాశం కల్పించారు. వీరితో పాటు కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌ను ఇప్పటికే అభ్యర్థులుగా ప్రకటించారు.  

సోమవారం బీఆర్ఎస్ భవన్‌లో ఖమ్మం, మహబూబాబాద్ రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ రెండు నియోజకవర్గాల్లో సిట్టింగులకు మరోసారి అవకాశం కల్పించారు. 2019లో ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు 1 లక్ష 67వేల మెజార్టీతో, మహబూబాబాద్ నుంచి కవిత 1 లక్ష 46వేల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించారు. అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.


More Telugu News