రైలు ప్రమాద ఘటనాస్థలికి వెళ్లనున్న సీఎం జగన్

రైలు ప్రమాద ఘటనాస్థలికి వెళ్లనున్న సీఎం జగన్
  • విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం
  • 14 మంది మృతి.. చికిత్స పొందుతున్న 54 మంది
  • తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్
విజయనగరం జిల్లా కంటాకపల్లి వద్ద నిన్న ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నెమ్మదిగా వెళ్తున్న పలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి వచ్చిన రాయగడ ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 54 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  

ఈ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 2 లక్షల చొప్పున ఆయన పరిహారాన్ని ప్రకటించారు. ఇతర రాష్ట్రాల వారు మరణిస్తే రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 20 వేల చొప్పున ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

మరోవైపు ఈరోజు రైలు ప్రమాద ఘటనా స్థలిని జగన్ సందర్శించనున్నారు. విజయవాడ నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో వెళ్లనున్న సీఎం... అక్కడి నుంచి ప్రమాద స్థలానికి హెలికాప్టర్ లో వెళతారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు.


More Telugu News