AP Govt - YogAndhra

పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం జగన్‌..రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదనేదే తమ లక్ష్యమని వ్యాఖ్య!

పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం జగన్‌..రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదనేదే తమ లక్ష్యమని వ్యాఖ్య!
  • రూ. 1,124 కోట్లను విడుదల చేసిన జగన్
  • చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు శ్రీకారం చుట్టామన్న సీఎం
  • గత ప్రభుత్వ బకాయిలు కూడా చెల్లించామని వెల్లడి
ఎంఎస్ఎంఈ, టెక్స్ టైల్, స్పిన్నింగ్ పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. తన క్యాంపు కార్యాలయం నుంచి రూ. 1,124 కోట్ల నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఈరోజు శ్రీకారం చుట్టిందని తెలిపారు.

ఈ పరిశ్రమల ద్వారా 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని చెప్పారు. ఇన్వెస్టర్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలను కల్పిస్తున్నామని... పరిశ్రమలను తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం రాయితీలను ఇస్తుందనే నమ్మకాన్ని కలిగించాలని చెప్పారు.
 
గత ప్రభుత్వ హయాంలో పని తక్కువ, హడావుడి ఎక్కువగా ఉండేదని జగన్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ బకాయిలు రూ. 1,588 కోట్లు చెల్లించామని చెప్పారు. ఇప్పటి వరకు రూ. 2,086 కోట్ల ప్రోత్సాహకాలను అందించామని తెలిపారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు 62 శాతం ప్రోత్సాహకాలను అందించామని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా వరుసగా రెండో ఏడాది పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలను అందించామని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదనేని తమ లక్ష్యమని తెలిపారు.


More Telugu News