టీకా ఎగుమతులపై ఎలాంటి నిషేధం విధించలేదు: కేంద్రం

టీకా ఎగుమతులపై ఎలాంటి నిషేధం విధించలేదు: కేంద్రం
  • ఇప్పటి వరకు 80కి పైగా దేశాలకు భారత టీకాలు
  • మొత్తం 644 లక్షల టీకా డోసుల పంపిణీ
  • భారత్‌లో తయారైన టీకాలకు డిమాండ్‌
  • దేశీయ అవసరాలకే తొలి ప్రాధాన్యమన్న విదేశాంగ శాఖ
ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను పంపడంలో భారత్‌ ముందుందని విదేశాంగశాఖ  తెలిపింది. ఇప్పటికే 80కి పైగా దేశాలకు 644 లక్షల టీకా డోసులను సరఫరా చేసినట్లు వెల్లడించింది. అలాగే కరోనా నిరోధక టీకా ఎగుమతులపై ఇప్పటి వరకు ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేశారు.

‘వ్యాక్సిన్‌ మైత్రి’ పేరిట భారత్‌ ఇతర దేశాలకు టీకా అందించే కార్యక్రమం విజయవంతమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బక్షి తెలిపారు. ఈ కార్యక్రమం అందించిన 644 లక్షల డోసుల్లో 104 లక్షల డోసుల్ని గ్రాంట్‌ కింద, 357 లక్షల డోసుల్ని వాణిజ్యపరమైన ఒప్పందం మేరకు, 182 లక్షల డోసులు కొవాక్స్‌ కార్యక్రమం కింద అందించినట్లు వివరించారు.

భారత్‌లో తయారైన టీకాలకు డిమాండ్‌ ఉందని.. అందుకే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వినతులు అందాయని తెలిపారు. అయితే, దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఇతర దేశాలకు సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భాగస్వామ్య దేశాలు అర్థం చేసుకుంటాయని భావిస్తున్నామన్నారు. టీకా తయారీ ప్రధాన లక్ష్యం దేశీయ అవసరాలే అన్న విషయాన్ని గుర్తించాలన్నారు.


More Telugu News