'మాస్క్ ధరించడంపై నిబంధనలను సడలించిన ముంబై నగరపాలక సంస్థ!

'మాస్క్ ధరించడంపై నిబంధనలను సడలించిన ముంబై నగరపాలక సంస్థ!
  • ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారికి వెసులుబాటు
  • ప్రస్తుతం రూ. 200 జరిమానా వసూలు  
  • ప్రజా రవాణా వినియోగిస్తే మాత్రం మాస్క్ తప్పనిసరి
బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చిన వేళ, ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలన్న నిబంధనను కఠినంగా అమలు చేస్తున్న ముంబై నగర పాలక అధికారులు, తాజాగా నిబంధనలను సవరించారు. తమ సొంత, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు మాస్క్ లను ధరించడం తప్పనిసరేమీ కాదని, వారిపై ఎటువంటి జరిమానాలూ విధించబోమని ప్రకటించారు. ఈ నిబంధనల సవరణ తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రజా రవాణాను వాడుతున్నా, టాక్సీలు, రిక్షాల్లో ప్రయాణిస్తున్నా మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు.

ఈ మేరకు ముంబై మునిసిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలు కేవలం ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తుంటేనే వర్తిస్తాయని, ప్రజా రవాణా వాడుతూ మాస్క్ ధరించకుండా పట్టుబడితే జరిమానా చెల్లించాల్సిందేనని అన్నారు. కాగా, మహారాష్ట్రలో దీపావళి సీజన్ తరువాత కరోనా కేసులు పెరుగుతుండగా, నగర ప్రజలపై మరిన్ని ఆంక్షలను అధికారులు అమలు చేస్తూ వచ్చారు. మాస్క్ లేనివారి నుంచి జరిమానాగా రూ. 200 వసూలు చేశారు. నవంబర్ నాటికి మాస్క్ లేని వారి నుంచి సుమారు రూ. 64 లక్షలు జరిమానాగా వసూలైందని బీఎంసీ అధికారులు వెల్లడించారు.


More Telugu News