Yogandhra

ఎన్నికలకు రెడీగా ఉండండి: కార్యకర్తలకు రజనీకాంత్ పిలుపు!

ఎన్నికలకు రెడీగా ఉండండి: కార్యకర్తలకు రజనీకాంత్ పిలుపు!
  • చెన్నైలో ఆర్ఎంఎం కార్యదర్శులతో సమావేశం
  • పలు అంశాలపై చర్చ జరిగింది
  • స్థానిక నేతలంతా సంతృప్తిగా ఉన్నారన్న రజనీ
2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంలో ఉన్న రజనీ, ఇప్పటికే ఆర్ఎంఎం (రజనీ మక్కల్ మన్రం) పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ జిల్లా కార్యదర్శులతో చెన్నైలో ప్రత్యేకంగా సమావేశమైన రజనీ, పలు అంశాలపై వారితో చర్చించారు.

ఎన్నికల్లో కమలహాసన్ తో కలసి వెళ్లాలా? వద్దా? అన్న విషయంపైనా చర్చ జరిగింది. ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు, ఓటములు ఎలా ఉంటాయన్న అంశంపైనా రజనీ సలహాలు అడిగారు. ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా, పోటీకి సిద్ధంగా ఉండాలని రజనీ కోరారు.

ఇక ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రజనీ, తమ సమావేశంలో చాలా విషయాలను చర్చించుకున్నామని అన్నారు. తన సంస్థ స్థానిక నేతలంతా ఈ భేటీపై సంతృప్తిగా ఉన్నారని, అయితే, ఓ విషయంలో మాత్రం తాను మోసపోయానన్న భావనలో ఉన్నానని, దాని గురించి ఇప్పుడే చెప్పలేనని, సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని కీలక వ్యాఖ్యలు చేశారు.


More Telugu News