Pakistan airspace closure: గగనతలం మూసివేసిన పాక్... ప్రయాణికులను అప్రమత్తం చేసిన ఎయిరిండియా, ఇండిగో

Pakistan Closes Airspace Air India Indigo Alert Passengers

  • పహల్దామ్ ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు
  • పాక్ పై పలు కఠిన చర్యలు ప్రకటించిన భారత్
  • అదే రీతిలో స్పందించిన పాక్ 
  • భారత విమానాలకు తమ గగనతలం మూసివేస్తున్నట్టు ప్రకటన
  • విమాన సర్వీసులపై ప్రభావం

న్నరత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించడం తెలిసిందే. ఈ అనూహ్య పరిణామంతో పలు అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడవచ్చని ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియా తమ ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. విమానాలను ప్రత్యామ్నాయ, సుదీర్ఘ మార్గాల్లో మళ్లించాల్సి వస్తుందని, దీనివల్ల ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థలు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తెలిపాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పౌరులు, పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న దౌత్యపరమైన చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ గగనతల మూసివేత నిర్ణయం తీసుకుంది. వీసాల జారీని నిలిపివేయడం, సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం వంటి చర్యలను భారత్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తమ గగనతలాన్ని భారత విమానాలకు పూర్తిగా నిషేధించింది.

ఎయిరిండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఉత్తర అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే కొన్ని విమానాలపై ఈ ప్రభావం పడనుంది. ఇండిగో కూడా ఇదే విధమైన ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు తమ విమాన ప్రయాణ సమయాలను, షెడ్యూళ్లను తప్పనిసరిగా సరిచూసుకోవాలని రెండు సంస్థలూ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశాయి.

మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో పౌరులు, పర్యాటకులు సహా 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లలో పౌరులపై జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదే. 2019 పుల్వామా దాడి తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద ఉగ్రఘటన. ఈ దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. దాడి జరిగిన సమయంలో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ఆయన, వెంటనే భారత్‌కు తిరిగి వచ్చి, ఉగ్రవాదులను, వారి వెనుక ఉన్న శక్తులను వదిలిపెట్టేది లేదని, గుర్తించి శిక్షిస్తామని గట్టిగా హెచ్చరించారు. బీహార్‌లోని మధుబని సభలో ఆయన హిందీ నుంచి ఆంగ్లానికి మారి చేసిన హెచ్చరిక, అంతర్జాతీయ సమాజానికి భారత్ ఇస్తున్న స్పష్టమైన సంకేతంగా విశ్లేషకులు భావించారు.

అంతకుముందు, ప్రధాని సౌదీ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఆయన విమానం పాకిస్తాన్ గగనతలం మీదుగా కాకుండా, పక్క నుంచి రావడం గమనార్హం. పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉందని భారత భద్రతా సంస్థలు ముందుగానే పసిగట్టి, ప్రధాని భద్రత దృష్ట్యా విమాన మార్గాన్ని మార్చినట్లు అర్థమవుతోంది.

Pakistan airspace closure
Air India
Indigo
India-Pakistan relations
Jammu and Kashmir terror attack
Narendra Modi
International flights
Flight disruptions
Travel advisory
Pahalgham attack
  • Loading...

More Telugu News