YS Sharmila: నిఘా వ్యవస్థ బీజేపీ కోసమే పనిచేస్తోంది... పహల్గామ్ దాడి కేంద్రం వైఫల్యమే: షర్మిల

YS Sharmila Blames BJP for Pahalgham Attack

  • పహల్గామ్ లో ఉగ్రదాడి
  • తీవ్రంగా స్పందించిన షర్మిల
  • కశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతంలో భద్రతా లోపం ఎందుకు తలెత్తిందని ఆగ్రహం
  • మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యమేనని ఆమె ఆరోపించారు. ఈ దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ పదవులకు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

దేశంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేసుకున్నారని, పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేశారని షర్మిల గుర్తుచేశారు. ఏటా కోట్లాది మంది పర్యాటకులు సందర్శించే కశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతంలో భద్రతా లోపం ఎందుకు తలెత్తిందని ఆమె ప్రశ్నించారు. "పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుంటే అక్కడ కనీస భద్రతా సిబ్బంది లేకపోవడం దారుణం. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం" అని షర్మిల పేర్కొన్నారు.

ఉగ్రవాదాన్ని నియంత్రించాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై ఉందని, 'చౌకీదార్' అని చెప్పుకునే మోదీ పాలనలో ఇదేనా భద్రత కల్పించే తీరు అని ఆమె నిలదీశారు. ఈ ఘటన స్పష్టంగా నిఘా వైఫల్యమని, దేశ నిఘా వ్యవస్థలు దేశం కోసం కాకుండా, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారిపైనే దృష్టి సారిస్తున్నాయని ఆమె ఆరోపించారు. "దేశ దర్యాప్తు, నిఘా వ్యవస్థలను సొంత రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు. నిఘా వర్గాల బలం అంతా ప్రధాని మోదీ కోసం పనిచేస్తోంది తప్ప, దేశ భద్రత కోసం కాదు" అని షర్మిల విమర్శించారు.

ఇంత ఘోరంగా భద్రతా వ్యవస్థలు విఫలమైన ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని షర్మిల అన్నారు. వీరు దేశానికి కాదు, బీజేపీకి చౌకీదార్లని ఆమె వ్యాఖ్యానించారు. దేశ భద్రతను పూర్తిగా గాలికొదిలేశారని, ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ తప్పిదమేనని ఆమె స్పష్టం చేశారు. ఈ దాడిలో ఒక ముస్లిం వ్యక్తి కూడా మరణించారని గుర్తు చేస్తూ, దేశంలోని ముస్లింలందరినీ చెడ్డవారిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. 

"ఈ దేశంలో మతం పేరుతో యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు. అంతర్గతంగా భద్రత కరువైంది. అన్ని మతాలు సమానం అనే భావన లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితులు తీవ్రవాదులకు అవకాశమిచ్చినట్లు అవుతుంది. మోదీ తన సమయాన్ని, శ్రమను దేశ భద్రతపై కేంద్రీకరించి ఉంటే బయటి శక్తులు ఇలా చొరబడే పరిస్థితి ఉండేది కాదు" అని షర్మిల అభిప్రాయపడ్డారు.

YS Sharmila
Pahalgham Attack
Jammu and Kashmir
Terrorist Attack
India Security Failure
BJP Government
Narendra Modi
Amit Shah
National Security
Intelligence Failure
  • Loading...

More Telugu News