Chandrababu Naidu: రేపు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని అమరావతికి ఆహ్వానించనున్న చంద్రబాబు దంపతులు!

- మే2న అమరావతి పనుల పునఃప్రారంభం
- మోదీ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఏపీ ప్రభుత్వం
- అమరావతిలో భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (ఏప్రిల్ 25) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. చంద్రబాబు వెంట ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.
చంద్రబాబు దంపతులు రేపు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళతారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు మోదీతో సమావేశం అవుతారు. మే 2వ తేదీన రాజధాని అమరావతిలో చేపట్టనున్న కార్యక్రమానికి ప్రధానిని అధికారికంగా ఆహ్వానించడమే ఈ భేటీ ప్రధాన అజెండాగా తెలుస్తోంది.
అమరావతి పనుల పునఃప్రారంభానికి శ్రీకారం
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మే 2వ తేదీన అమరావతిలో నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, పనులకు శంకుస్థాపన చేయాల్సిందిగా ప్రధాని మోదీని చంద్రబాబు రేపటి ఢిల్లీ పర్యటనలో కోరనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
భారీ ఏర్పాట్లు.. లక్షలాదిగా జన సమీకరణ
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అమరావతిలో జరగనున్న బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పి. నారాయణ మీడియాకు వెల్లడించారు. సభా స్థలికి ప్రజలు సులభంగా చేరుకునేందుకు జాతీయ రహదారికి అనుసంధానంగా 8 రోడ్లను, వాహనాల పార్కింగ్ కోసం 11 విశాలమైన ప్రదేశాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు.
సభా ప్రాంగణంలో మొత్తం మూడు వేదికలను ఏర్పాటు చేయనున్నామని, ప్రధాన వేదికతో పాటు మరో వేదికపై రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, మహిళలు, రాజధాని పరిరక్షణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులు ఉంటారని మంత్రి నారాయణ వివరించారు. అంతేకాకుండా, హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు సుమారు 1.1 కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ రోడ్ షో కూడా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన, ప్రధానితో భేటీ అనంతరం మే 2 నాటి కార్యక్రమంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.