Lashkar-e-Toiba: కాశ్మీర్లో లష్కరే తొయిబా ఓజీడబ్ల్యూ మాడ్యూల్ సభ్యుల అరెస్ట్

- రెండు వేర్వేరు ఆపరేషన్లలో నలుగురు ఓజీడబ్ల్యూల అరెస్ట్
- నిందితుల నుంచి గ్రెనేడ్లు, మ్యాగజైన్, బుల్లెట్లు స్వాధీనం
- పోలీసులు, భద్రతా బలగాలు, స్థానికేతరులపై దాడులే లక్ష్యం
- యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదు, దర్యాప్తు ప్రారంభం
జమ్మూకశ్మీర్లోని బందిపొర జిల్లాలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓవర్ గ్రౌండ్ వర్కర్ల (ఓజీడబ్ల్యూ) మాడ్యూల్ను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. రెండు వేర్వేరు ఆపరేషన్లలో నలుగురు ఓజీడబ్ల్యూలను అరెస్ట్ చేసి, వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు గురువారం వెల్లడించారు.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు, సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సంయుక్తంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. కనిపోరా నైద్ఖాయ్ సుంబాల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద మహమ్మద్ రఫీక్ ఖాండే, ముఖ్తార్ అహ్మద్ దార్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక 7.62 ఎం.ఎం మ్యాగజైన్, 30 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మరో ఆపరేషన్లో భాగంగా సదునారా అజాస్ వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రంలో రేయీస్ అహ్మద్ దార్, మహమ్మద్ షఫీ దార్ అనే మరో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి కూడా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
పట్టుబడిన నలుగురు నిందితులు లష్కరే ఓజీడబ్ల్యూ నెట్వర్క్లో సభ్యులుగా ఉన్నామని, అజాస్, నైద్ఖాయ్ సుంబల్ పరిసర ప్రాంతాల్లో దాడులకు తమకు ఆదేశాలు అందినట్లు, దాడులకు ప్లాన్ చేసినట్లు విచారణలో అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. ఈ రెండు ఘటనలపై సుంబాల్ పోలీస్ స్టేషన్లో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద వేర్వేరు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.