Hareesh: బట్టతలపై జుట్టు మొలిపిస్తామన్నారు... హైదరాబాదులో పోలీసుల అదుపులో ముగ్గురు!

- బట్టతలపై వెంట్రుకలు వస్తాయంటే బారులు తీరిన బాధితులు
- ఎంట్రీ ఫీజు రూ.300, ఆయిల్ ఖరీదు రూ.700లు చెల్లించి మోసపోయిన వైనం
- ఉప్పల్లో నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బట్టతల ఉన్నవారికి వెంట్రుకలు మొలిపిస్తామని ఓ వ్యక్తి ప్రచారం చేయడంతో, అనేకమంది బాధితులు అక్కడకు చేరుకున్నారు. హరీశ్ అనే వ్యక్తి ఉప్పల్ బాగాయత్ ప్రాంతంలో శిబిరం ఏర్పాటు చేయడంతో బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఢిల్లీ నుండి ఫ్రాంచైజ్ తీసుకున్నామని, ప్రత్యేకమైన నూనెను ఇవ్వడం ద్వారా బట్టతలను నివారిస్తామని హరీశ్, వినోద్, రాజశేఖర్లు నమ్మబలికారు. బట్టతల బాధితుల ఆశను సొమ్ము చేసుకుని, ప్రవేశ రుసుముగా రూ.300లు, నూనె ఖరీదుగా రూ.700లు వసూలు చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, నిర్వాహకులు హరీశ్, రాజశేఖర్, వినోద్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇంతకుముందు, ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి ఇదే తరహాలో పాతబస్తీలో బట్టతల బాధితుల నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. ఈ నేపథ్యంలో, పోలీసులు అప్రమత్తమై ఉప్పల్లో మోసానికి పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న బాధితులు నిరాశకు గురయ్యారు.