Rohit Sharma: టీ20ల్లో రోహిత్, బుమ్రా అరుదైన రికార్డులు

- నిన్న ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్, ఎంఐ మ్యాచ్
- హైదరాబాద్ను 7 వికెట్ల తేడాతో ఓడించిన ముంబయి
- ఎంఐ విజయంలో 70 పరుగులతో కీలక పాత్ర పోషించిన రోహిత్
- ఈ క్రమంలో టీ20ల్లో 12వేల రన్స్ ఫీట్ను పూర్తి చేసిన హిట్మ్యాన్
- కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా రికార్డ్
- టీ20 క్రికెట్లో 300 వికెట్ల మైలురాయిని చేరిన బుమ్రా
- టీ20ల్లో అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న భారత బౌలర్ రికార్డ్
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా టీ20ల్లో అరుదైన రికార్డులు నమోదు చేశారు. బుధవారం ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్ లో ఈ ముంబయి ఇండియన్స్ (ఎంఐ) ఆటగాళ్లు అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకున్నారు.
ఇక, ఈ మ్యాచ్ లో హైదరాబాద్ను ముంబయి ఏడు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఎంఐ విజయంలో ఆ జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ 46 బంతుల్లో 70 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో హిట్మ్యాన్ టీ20 క్రికెట్లో 12వేల పరుగుల మైలురాయిని పూర్తి చేశాడు.
విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా రోహిత్ రికార్డుకెక్కాడు. ఓవరాల్గా టీ20ల్లో 12వేల పరుగులు పూర్తి చేసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం హిట్మ్యాన్ ఖాతాలో 12,056 టీ20 పరుగులు ఉన్నాయి.
ఇక, ఇదే మ్యాచ్లో ఎంఐ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా అరుదైన రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ వికెట్ తీయడం ద్వారా టీ20 క్రికెట్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా (237 ఇన్నింగ్స్) ఈ మార్కును అందుకున్న భారత బౌలర్గా నిలిచాడు. అలాగే ఐపీఎల్లో ముంబయి తరఫున అత్యధిక వికెట్లు (170) తీసిన లసిత్ మలింగ రికార్డును బుమ్రా సమం చేశాడు.