Rajnath Singh: పహల్గాం దాడికి త్వరలోనే గట్టి జవాబు ఇస్తాం: రాజ్నాథ్ సింగ్

- ఉగ్రవాదులకు రక్షణ మంత్రి గట్టి జవాబు
- దాడికి పాల్పడిన వారికి, వెనకుండి నడిపించిన వారికీ గట్టి సమాధానం ఇస్తామని వ్యాఖ్య
- ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం ఉపేక్షించదని స్పష్టీకరణ
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులు, పౌరులే లక్ష్యంగా జరిగిన అత్యంత హేయమైన ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, దాడికి పాల్పడిన ఉగ్రవాదులను, వారి వెనకుండి నడిపించిన సూత్రధారులను విడిచిపెట్టబోమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఉగ్రవాదం పట్ల భారత్ ఏమాత్రం సహించబోదని ఆయన స్పష్టం చేశారు.
దాడి ఘటన అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో సమావేశమయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, "ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి సమీప భవిష్యత్తులోనే గట్టి సమాధానం చెబుతాం" అని హెచ్చరించారు. "దాడి చేసిన వారిని పట్టుకోవడమే కాదు, ఈ కుట్ర వెనుక తెరచాటున దాగి ఉన్న వారిని కూడా వదిలిపెట్టం. దాడి చేసిన వారిని, వారి వెనుక ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటాం" అని ఆయన స్పష్టం చేశారు.
ఉగ్రవాదంపై పోరులో భారత్ ఐక్యంగా ఉందని, ఉగ్రవాదం పట్ల తమది 'జీరో టాలరెన్స్' విధానమని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. అవసరమైన, తగిన ప్రతిచర్య తీసుకుంటామని ఆయన తెలిపారు. భారత్ ఒక ప్రాచీన దేశమని, ఉగ్రవాదానికి భయపడదని అన్నారు.