Pawan Kalyan: తన సినిమాల నిర్మాతలతో పవన్ కల్యాణ్ కీలక భేటీ... సినీ కెరీర్ గురించి కీలక సంకేతాలు!

- ఏఎం రత్నం, డీవీవీ దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ తో పవన్ భేటీ!
- 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలనుకుంటున్న పవన్
- 'ఉస్తాద్ భగత్ సింగ్' నిర్మాతలకు కూడా ఊరటనిచ్చిన పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తన పెండింగ్ సినిమా ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన నిన్న తన సినిమాల నిర్మాతలతో ప్రత్యేకంగా సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, సినీ రంగంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా పవన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు ఏఎం రత్నం, డీవీవీ దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులు పాల్గొన్నట్లు సమాచారం. ముఖ్యంగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగాన్ని పూర్తి చేసి, వచ్చే ఏడాది మే నెలలో సినిమాను విడుదల చేసేలా నిర్మాతలకు ఆయన హామీ ఇచ్చినట్లు టాక్!
'హరిహర వీరమల్లు'తో పాటు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓజీ', హరీష్ శంకర్ దర్శకత్వంలోని 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలను కూడా పూర్తి చేయాల్సి ఉంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' నిర్మాతలకు జులై నెల నుంచి డేట్స్ కేటాయిస్తానని పవన్ చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన వ్యాఖ్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బహుశా 'ఉస్తాద్ భగత్ సింగ్' తన చివరి సినిమా కావచ్చని ఆయన సంకేతాలు ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్న పవన్ తన సినిమా కమిట్మెంట్లను పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన నిర్ణయంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిర్మాతలకు, అభిమానులకు కొంత ఊరట లభించినట్లయింది.